చిరుధాన్యాలను ఆహారంగా స్వీకరించుట సంపూర్ణ ఆరోగ్యానికి బాసటగా నిలుస్తుందని మండల వ్యవసాయాధికారి బి ప్రసాదరావు అన్నారు. తాళ్లూరు మండలంలోని తూర్పు గంగవరం గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో గురువారం విద్యార్థినీ విద్యార్థులకు చిరుధాన్యాలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మండల వ్యవసాయాధికారి బి. ప్రసాదరావు మాట్లాడుతూ… విద్యార్థులు, ప్రజలు తాము తీసుకునే ఆహారంలో చిరుధాన్యాలను ఒక పూట ఆహారంగా తీసుకున్నట్లయితే అది మన ఆయుష్షును పెంచుతూ, జీవనశైలిలో వ్యాధి లేని జీవితాన్ని ప్రసాదిస్తుందని ఆయన అన్నారు. కొర్రలు వాడడం వల్ల మధుమేహం దూరం అవుతుందని ఆయన సూచించారు. అనంతరం విద్యార్థినీ విద్యార్థుల చేత న్యూ డిల్స్ వద్దు… మిల్లెట్స్ ముద్దు, పానీ పూరి వద్దు …మిల్లెట్ పూరి ముద్దు …అని నినాదాలు చేయించారు. కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు ఎన్. పి నాగిరెడ్డి, ఉపాధ్యాయులు సిహెచ్ శ్రీనివాసులు, పి కృష్ణ, ఎస్.కె ఖాజావలి గ్రామ వ్యవసాయ సహాయకులు సుమ తదితరులు పాల్గొన్నారు.
