అపార్ ( ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ) ఐ.డి. రూపకల్పన ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. ఈ విషయమై శనివారం మండల విద్యాధికారులు, ప్రైవేటు పాఠశాలల నిర్వాహకులు, ఉపాధ్యాయ సంఘాలు, ప్రైవేటు కళాశాలల ప్రిన్సిపాళ్ళతో ప్రకాశం భవనంలో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అపార్ ఐ.డీ. జనరేషన్ పురోగతిపై కలెక్టర్ ఈ సందర్భంగా సమీక్షించారు. అడ్మినిస్ట్రేషన్ రిజిస్టర్, ఆధార్ కార్డు, యుడైస్ లలో విద్యార్థి పేరు, పుట్టిన తేదీ వివరాలు సరిపోలినట్లయితే వారికి వెంటనే అపార్ ఐ.డి. జనరేట్ చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు సంబంధించిన డేటా మేనేజ్మెంట్ కోసం అపార్ ఐ.డీ. రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విధానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందున అపార్ ఐ.డి. జనరేట్ ప్రక్రియ అని వేగవంతం చేయాలని అధికారులకు ఆమె దిశా నిర్దేశం చేశారు. కాగా యుడైస్ లాగిన్ ఎం.ఈ.ఓ.ల ఆధ్వర్యంలో ఉన్నదని, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు లాగిన్ ఇస్తే కొంత వెసులుబాటు ఉంటుందని ఈ సందర్భంగా పలువురు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. అదేవిధంగా విద్యార్థుల పేర్లలో మార్పులు, పుట్టిన తేదీలో తప్పులను సరిచేయడానికి ప్రత్యేకంగా ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ను కోరారు. దీనిపై ఆమె స్పందిస్తూ లాగిన్ విషయమై విద్యాశాఖ ప్రిన్సిపుల్ సెక్రటరీకి లేఖ రాస్తానని చెప్పారు. నవంబరు 14వ తేదీన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ విజయవంతంగా నిర్వహించేందుకు ఇప్పటినుంచే పాఠశాలల స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి ఏ.కిరణ్ కుమార్, డిప్యూటీ డి.ఇ.ఓ.లు సామా సుబ్బారావు, చంద్రమౌళీశ్వరరావు, ఆర్.ఐ.ఓ. సైమన్ విక్టర్, సమగ్ర శిక్ష అభియాన్ ఏ.ఎం.ఓ. రమేష్, డి.సి.ఇ.బి. కార్యదర్శి ఎం.శ్రీనివాసరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.



