ఆధార్ కార్డుల నవీకరణ ప్రక్రియ జిల్లాలో పటిష్టంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ, అధికారులను ఆదేశించారు.
మంగళవారం కలెక్టరేట్ లోని జాయింట్ కలెక్టర్ చాంబర్ లో ఆధార్ కార్డుల నమోదు, నవీకరణ ప్రక్రియపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ… ఆధార్ కార్డుల నవీకరణ పెండింగ్ ప్రక్రియపై అధికారులు దృష్టి సారించాలన్నారు. ఐదేళ్లలోపు పిల్లలకు, వైద్య ఆరోగ్య శాఖ, ఐసీడీ ఎస్ జీఎస్ డబ్ల్యూ, పోస్టల్ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆధార్ నమోదు కేంద్రాలన్నీ పని చేయాలన్నారు. కొత్తగా జన్మించిన శిశువుల ఆధార్ ఎన్ రోల్ మెంట్ కు సంబంధించి బర్త్ రిజిస్ట్రేషన్ బేస్డ్ ఆధార్ ఎన్రో ల్మంట్ అనే విధానాన్ని అవలంభించాలన్నారు. నవీకరణ ప్రక్రియపై ప్రజలకు తక్షణమే అవగాహన కల్పించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రి లేదా ఏ ఆసుపత్రిలో శిశు జన్మించినప్పటికీ తక్షణమే ఆ శిశువు ఆధార్ నమోదు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అపార్ ఐడి నమోదులో పెండింగ్ ఉండరాదని ఆదేశించారు. ఆధార్ కార్డుల నవీకరణ ప్రక్రియపై క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఆధార్ నవీకరణ ప్రక్రియలో ఎలాంటి సమస్యలు రాకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆయన పలు సూచనలు చేశారు.
ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సిఈ ఓ చిరంజీవి, ఐసిడిఎస్ పిడి హేన సుజన, ఉదయ్ సంస్థ ప్రతినిధులు, ఆధార్ జిల్లా కోఆర్డినేటర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


