మలేరియా నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు.ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఒంగోలులో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్బంగా ర్యాలీలో పాల్గొన్న వారితో మలేరియా నియంత్రణ ప్రతిజ్క్ష చేయించారు. ఈ ర్యాలీ ఒంగోలు కలెక్టరేట్ నుంచి నెల్లూరు బస్టాండ్ వరకు నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ, ప్రతిఏటా ఏప్రిల్ 25వ తేదీన మలేరియా నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. ఈ ఏడాది మలేరియా నివారణ మనందరి బాధ్యత అన్న నినాదంతో జరుపుతున్నామన్నారు. మలేరియా వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. మలేరియా వ్యాధి నిర్దారణ, సకాలంలో చికిత్స వంటి వాటితో నియంత్రించవచ్చన్నారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మలేరియా నిర్దారణ సౌకర్యాలు, చికిత్సకు అవసరమైన ఏర్పాట్లు ఉన్నాయన్నారు.
ఈ ర్యాలీ లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా వెంకటేశ్వర రావు, జిల్లా మలేరియా అధికారి డా. మధుసూదన్ రావు, ఆశా వర్కర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



