నాగార్జునసాగర్ కుడికాలువ ద్వారా విడుదల చేసిన నీళ్లను కేవలం తాగునీటి అవసరాలకే వినియోగించుకునేలా చూడాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా
స్పష్టం చేశారు. ఈ దిశగా పర్యవేక్షించేందుకు రెవెన్యూ, పోలీస్, ఆర్డబ్ల్యూఎస్, పబ్లిక్ హెల్త్ , మున్సిపల్, జల వనరుల శాఖల అధికారులతో ప్రత్యేక కమిటీని ఆమె ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు నుంచి ఈనెల 23వ తేదీన నాలుగు టి.ఎం.సి.ల నీళ్లను అధికారులు విడుదల చేశారు. వీటిని పల్నాడు, గుంటూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాలు వినియోగించుకోవాల్సి ఉన్న నేపథ్యంలో వ్యవసాయ అవసరాలకు కాకుండా కేవలం తాగునీటి కోసమే వీటిని వినియోగించుకునేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. మోటర్ల ద్వారా వ్యవసాయ అవసరాల కోసం ఈ నీటిని ఎవరూ దొంగిలించకుండా కాలువగట్లపై గస్తీ నిర్వహించాలని ఆమె చెప్పారు. అవసరమైన తాగునీటి ట్యాంకులు, ఇతర వనరులకు సాగర్ నీటిని మళ్లించి జిల్లాలోని ప్రజలకు తాగునీటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
