గిరిజన ఆవాస ప్రాంతాలలో మౌలిక సదుపాయాలను త్వరగా కల్పించడంపై మరింత
దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. పీ.ఎం – జన్ మన్, డీ.ఏ – జె.జి.యు.ఏ. పథకాలలో భాగంగా చేపట్టిన కార్యక్రమాలలో పురోగతిపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో మంగళవారం ప్రకాశం భవనంలో ఆమె ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. గిరిజన ఆవాసాలలో, ప్రత్యేకించి ఐటీడీఏ పరిధిలో ఉన్న జిల్లాలోని పశ్చిమ ప్రాంత ప్రజలకు మౌలికసదుపాయాలను ఘననీయంగా మెరుగుపరచాల్సి ఉందన్నారు. ఈ దిశగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ప్రయోజనాలు గిరిజనులకు సమర్ధంగా అందేలా నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. గృహ నిర్మాణాలలో ప్రతివారం స్పష్టమైన పురోగతి ఉండాలని ఆమె చెప్పారు. గ్రామాల వారీగా కార్యాచరణ ప్రణాళికలను రూపొందించడంతోపాటు ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. బిల్లులను ప్రభుత్వం త్వరగా చెల్లిస్తున్నందున లబ్ధిదారులందరూ వెంటనే ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గిరిజన ఆవాస గ్రామాలకు రోడ్లు, విద్యుత్ సౌకర్యం, తాగునీరు, అంగన్వాడి కేంద్రాల ఏర్పాటు, వంట గ్యాస్ కనెక్షన్లు, టెలిఫోన్ టవర్ల నిర్మాణం, మొబైల్ మెడికల్ యూనిట్ల సేవలు అందేలా శాఖల వారీగానూ, సమన్వయంతోనూ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చెప్పారు. సాంకేతిక సమస్యలు ఏమైనా తలెత్తితే తన దృష్టికి తీసుకురావాలన్నారు.
ఈ సమావేశంలో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి వరలక్ష్మి, హౌసింగ్ పీడీ శ్రీనివాస ప్రసాద్,
ఆర్డబ్ల్యూఎస్ ఎస్.ఈ. బాల శంకర్రావు, డిప్యూటీ డీఈవో చంద్రమౌళీశ్వరరావు, జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి రవితేజ, డీఎంహెచ్వో వెంకటేశ్వర్లు, డీఎస్ఓ పద్మశ్రీ, ఐసిడిఎస్ పిడి సువర్ణ, మత్స్యశాఖ జే.డీ.శ్రీనివాసరావు, పశుసంవర్ధక శాఖ జె.డి. రవికుమార్, వ్యవసాయ శాఖ జె.డి. శ్రీనివాసరావు, ఏపీ సిపిడిసిఎల్ ఎస్.ఈ. కట్టా వెంకటేశ్వర్లు, రోడ్లు భవనాలు, టెలికాం శాఖ అధికారులు పాల్గొన్నారు.

