అసమానతలు లేని అభివృద్ధి కోసం సిపిఎం ప్రణాళిక రూపొందించిందని దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు నవంబర్ 15న విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నదని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కంకణాల ఆంజనేయులు తెలిపారు. సిపిఎం దరిశి మండల కార్యకర్తల సమావేశం ఈరోజు శుక్రవారం సుందరయ్య భవన్లో జరిగింది. ఈ సమావేశానికి ఆ పార్టీ సీనియర్ నాయకులు సందు వెంకటేశ్వర రావు అధ్యక్షత వహించారు. సమావేశాన్ని ఉద్దేశించి ఆంజనేయులు మాట్లాడుతూ ప్రజలు కరువు కాటకాలు, పంటలు దెబ్బతినటం, అధిక ధరలు, చార్జీల భారాలతో సతమతమవుతుంటే అధికార పార్టీ ఇదేమి పట్టకుండా వ్యవహరించటం విచారకరమని అన్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 5.33 లక్షల ఎకరాల్లో జిల్లాలో పంటలు సాగు చేయాల్సి ఉండగా 2.17 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు చేశారని తెలిపారు. అందులో 50 శాతం పైగా ఎండిపోయాయని, రభి సీజన్లో ఇప్పటికీ వర్షాలు పడనందున ఏ పంటలు వేయాలో, ఎలా బ్రతకాలో అర్థం కాక రైతులు నానా అవస్థలు పడుతున్నారని తెలిపారు. ఇంత దుర్భిక్ష పరిస్థితి ఉంటే ఒక్క మండలాన్ని కూడా కరువు మండలంగా గుర్తించక పోవడం అన్యాయం అన్నారు. మరోవైపు వ్యవసాయ పనులపై ఆధారపడి జీవించే కూలీలకు పనులు దొరకక పొట్ట చేత పట్టుకొని దేశం మీద వలస పోతున్నారని అన్నారు. ఇంకోకవైపు నిత్యవసర వస్తువుల ధరలు నిత్యం పెరుగుతున్నాయని, నిన్న మొన్నటి వరకు టమోటాలు కేజీ 200 అమ్మితే, నేడు ఉల్లిపాయలు ఆ స్థితికి చేరుతున్నాయని తెలిపారు. ఇలాంటి ప్రజా సమస్యలు పట్టించుకోకుండా పాలకులు ప్రచార యాత్రలు, బస్సు యాత్రలు చేయటం అధికార యావ తప్ప ప్రజలు, ప్రజా సమస్యలు పట్టలేదని విమర్శించారు. మరోవైపు ప్రతిపక్ష టిడిపి, జనసేన పార్టీలు వారి ఆందోళనలలో ప్రజా సమస్యలను ప్రస్తావించకపోవడం, పర్యటించక పోవడం సరి కాదని ఆయన అన్నారు.
రాష్ట్రంలో ఉన్న నీటి వనరులను సక్రమంగా వినియోగించుకొని ప్రాజెక్టుల నిర్మాణం చేయడం ద్వారా సమగ్ర అభివృద్ధి సాధించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఏడాదికి 1500 టిఎంసిల నీరు సముద్రం పాలవుతున్నదని దాని నిలబెట్టే విధంగా ప్రాజెక్టుల నిర్మాణం సాగాలని సిపిఎం ప్రణాళిక రూపొందించిందని అన్నారు. రాష్ట్రంలో ఉన్న సహజ వనరులు, ప్రకృతి సంపద ఆధారంగా పరిశ్రమల నిర్మాణం జరగాలని, విద్య, వైద్య, శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధికి తగిన ప్రణాళిక రూపొందించాలని అన్నారు. చిత్తశుద్ధి ఉంటే 60 రూపాయలకు లీటర్ పెట్రోల్, 400కు గ్యాస్ సిలిండర్, ఒక రూపాయికే యూనిట్ కరెంటు ఇవ్వొచ్చని తెలిపారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 40వేల టీచర్ పోస్టులు, 2.50 లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటువంటి అంశాల ఆధారంగా ప్రజా ప్రణాళిక రూపొందించామని, దీన్ని ప్రధాన ఎజెండా చేస్తూ ప్రజల్లో ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు. నవంబర్ 15న విజయవాడలో ప్రజా రక్షణ భేరి సభ నిర్వహిస్తున్నట్లు ఈ సభలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రజా ప్రణాళికను సాధించే విధంగా, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు.
సిపిఎం దరిశి కార్యదర్శి తాండవ రంగారావు మాట్లాడుతూ విజయవాడలో జరిగే ప్రజా రక్షణ బేరి సభకు నియోజకవర్గం అంతా కరపత్రాలు , స్టీక్కర్స్ , గోడ పత్రికల ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తామని,
10,11,12 తేదీలలో ప్రచార జాతాలు, కరపత్ర ప్రచారాలతో సిపిఎం ప్రణాళికను ప్రజలకు వివరిస్తామని తెలిపారు. పాలక పార్టీలు అధికారం కోసం ప్రజల్ని మబ్యపుచ్చేమాటలు చెబుతున్నారని అన్నారు. పాలకుల విధానాల వల్ల నష్టపోతున్న కార్మిక, కర్షక, కష్ట జీవులను విజయవాడ సభకు సమీకరణ చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు కెవి పిచ్చయ్య , ఈమని నాగేశ్వర రావు, ఉపు నారాయణ, sk కాలే భాషా, ఉప్పుటూరి నాగరాజు, తాండవ రంగనాయకులు , టి. లక్ష్మీ , నారాయణమ్మ, రంగమ్మ , పద్మావతి పాల్గొన్ని ప్రజలను పెద్ద ఎత్తున బహిరంగ సభకి తరలించాలని నిర్నయించారు.

