సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంపై బీ ఆర్ ఎస్ పార్టీ జెండాను ఎగురవేసి చరిత్రను తిరగరాస్తామని మాజీమంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా బుధవారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మోండా డివిజన్ లో సికింద్రాబాద్ పార్లమెంట్ బీ ఆర్ ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ లు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పాలికా బజార్ లోని సాయిబాబా ఆలయం నుండి ప్రారంభమైన పాదయాత్ర బండి మెట్, మారుతివీది, నాలా బజార్, పాట్ మార్కెట్, టకారా ఆదయ్య నగర్, గ్యాస్ మండి తదితర ప్రాంతాలలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరం కే సి ఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వ హయాంలో అన్ని రంగాలలో ఎంతో అభివృద్ధి చెందిందని, ఈ విషయం నగర ప్రజలందరికీ తెలిసిందేనని అన్నారు. ప్రజలు అభివృద్దిని కోరుకుంటున్నారని, అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు బీ ఆర్ ఎస్ పార్టీకి బ్రహ్మరధం పట్టిన విషయాన్ని గుర్తుచేశారు. అన్ని విధాలుగా ప్రజలకు అండగా ఉంటూ అభివృద్ధి చేసిన బీ ఆర్ ఎస్ వెంటే ప్రజలు ఉన్నారని, తిరిగి పార్లమెంట్ ఎన్నికలలో సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజా నాయకుడు పద్మారావు గౌడ్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఆచరణ సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని ధ్వజమెత్తారు. 100 రోజులలో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి 5 నెలలు కావస్తున్నా అమలుకు నోచుకోలేదని విమర్శించారు. ఆరు గ్యారెంటీ లలో 5 హామీలు అమలు చేస్తున్నామని ప్రకటించడం పూర్తి అవాస్తవమని, ఎక్కడ అమలు చేశారో నిరూపించాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి 5 నెలలు కావస్తున్నది… ఇప్పటి వరకు ఏం చేశారో చెప్పి ఓట్లు అడగాలని అన్నారు. కాంగ్రెస్, బిజే పీ పార్టీలు ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. బీ ఆర్ ఎస్ ప్రభుత్వ పాలనే బెటర్ అనే స్పష్టతకు ప్రజలు వచ్చారని అన్నారు. రోడ్ల అభివృద్ధి, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపర్చడం, త్రాగునీటి సమస్య పరిష్కారం, పార్క్ ల అభివృద్ధి తదితర అభివృద్ధి పనులే కాకుండా షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి తదితర సంక్షేమ కార్యక్రమాల అమలుతో పాటు అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను తమ ప్రభుత్వ హయాంలో అమలు చేశామని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు త్రాగునీటి కోసం అవస్థలు పడాల్సిన దుష్టితి వచ్చిందని విమర్శించారు. దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ బందు తదితర కార్యక్రమాల ద్వారా ఆయా వర్గాల అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలును మరిచిందని ధ్వజమెత్తారు. అన్ని వర్గాల పండుగలను కేసీఆర్ ప్రభుత్వం లో ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకున్న విషయాన్ని గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం క్రిస్మస్, రంజాన్ పండుగలను నిర్వహించలేదని, వారి పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉందో నిరూపించుకుందని ఎద్దేవా చేశారు. ఏం మొఖం పెట్టుకొని క్రిస్టియన్, ముస్లీం లను ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. అత్యధిక జనాభా కలిగిన మాదిగ సామాజిక వర్గంలో ఒక్కరికైనా ఎమ్ పి గా పోటీ చేసే అవకాశం కల్పించిందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ కి పోటీ చేసేందుకు అభ్యర్ధులు కూడా కరువైనండునే బీ ఆర్ ఎస్ పార్టీ నుండి వచ్చిన నేతలకు టికెట్ లు ఇచ్చి పోటీలో నిలిపారని విమర్శించారు. గడిచిన ౩౦ సంవత్సరాలుగా నిరంతరం ప్రజల మధ్య ఉండే పద్మారావు అంటే ఒక బ్రాండ్ ఆయన గెలుపు తధ్యం… ఎవరు ఆపలేరని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఆకుల రూప, డివిజన్ బీ ఆర్ ఎస్ అద్యక్షులు ఆకుల హరికృష్ణ, నాయకులు నాగులు, తలసాని స్కైలాబ్ యాదవ్, తలసాని ధర్మేందర్ యాదవ్, రాములు, మహేష్ యాదవ్, మహేష్, ప్రమోద్, అమర్, జయరాజ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.










