వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ను పునరుద్ధరించిన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ( APUWJ) ధన్యవాదాలు తెలిపింది.
ఆమేరకు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఐ వి.సుబ్బారావు , , ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్, ఐ.జే.యు. జాతీయ కార్యదర్శి డి. సోమసుందర్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏచూరి శివ శుక్రవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.
ప్రతిపాదనలు అందిన వెంటనే ముఖ్యమంత్రి ఆమోదించడం, ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేయటం హర్షణీయమని వారా ప్రకటనలో పేర్కొన్నారు.
గడచిన ఐదేళ్లలో ఈ పథకం పునరుద్ధరణ ఒక్కసారి కూడా సకాలంలో జరగలేదని, నెలల తరబడి జాప్యం జరగడం , కొన్ని సందర్భాల్లో జనవరి నెలలో సైతం పునరుద్ధరణ జరగక పోవడంతో జర్నలిస్టులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు.
కూటమి ప్రభుత్వం తొలి నెలలోనే జర్నలిస్టుల ఆరోగ్యంపై దృష్టి సారించి
హెల్త్ కార్డుల పునరుద్దరణకు ప్రాధాన్యత నివ్వడం మంచి పరిణామమని, మిగిలిన సమస్యల విషయంలోనూ ప్రభుత్వం ఇదే తరహాలో చొరవ తీసుకోవాలని యూనియన్ నాయకులు ఆ ప్రకటనలో ఆకాంక్షించారు.