శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో వేంచేసియున్న శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం నందు నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలో ప్రకాశం జిల్లా ఎస్పీ ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ దంపతులు పాల్గొని స్వామి వారికి పట్టువస్త్రాలను సమర్పించి, వేద మంత్రోచ్చారణలు, మంగళవాయిధ్యాల మధ్య సాంప్రదాయ బద్ధంగా మాంగల్యాధారణ, తలంబ్రాల ఘట్టాలను నిర్వహించి కమనీయంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని జరిపించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ…. పోలీస్ సిబ్బంది మరియు ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ పవిత్రమైన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది. సీతారాముల కళ్యాణం కేవలం ఒక వివాహ వేడుక మాత్రమే కాదని, ధర్మం, న్యాయం, ప్రేమ, కర్తవ్య నిర్వహణ వంటి గొప్ప ఆదర్శాలకు ప్రతీకన్నారు. శ్రీరాముడు ఆచరించిన జీవన విధానం పరిపూర్ణ మానవ జీవితానికి నిలువెత్తు నిదర్శనమని, సీతారాముల యొక్క జీవిత చరిత్ర ప్రజలందరికీ ఆదర్శప్రాయమని, కరుణ, దయ, నీతి, చిత్తశుద్ధి, ప్రేమ, ధర్మం, సత్యం ఆచరించి మార్గదర్శకంగా నిలవాలని, చైత్ర శుద్ధ నవమి రోజున జరుపుకునే శ్రీరామ నవమి పండుగను ప్రతి ఇంటా సుఖ సంతోషాలతో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ ఆకాంక్షించారు. అనంతరం ఎస్పీ ఏఆర్ దామోదర్ దంపతుల చేతుల మీదుగా భక్తులకు, ప్రజలకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకను ఇంత ఘనంగా నిర్వహించిన శ్రీ సీతారామచంద్ర స్వామి భక్త జన సేవా సమితి సభ్యులను జిల్లా ఎస్పీ అభినందించారు.
శ్రీరామ నవమి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ప్రముఖ దేవాలయాలకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున దేవాలయాల వద్ద బందోబస్తును ఏర్పాటు చేసినట్లు, దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, భక్తులు భక్తి శ్రద్ధలతో క్యూ లైన్ లు పాటిస్తూ ప్రతి ఒక్కరు దైవ దర్శనం చేసుకోవాలన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పోలీస్ సిబ్బందిని నియమించామని జిల్లా ఎస్పీ అన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె.నాగేశ్వరరావు, ఏ ఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు, సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్, ఒంగోలు మేయర్ గంగాడ సుజాత, ఒంగోలు డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, ఎఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు, ఐటి కోర్ సీఐ సూర్యనారాయణ, ఒంగోలు తాలూకా సీఐ అజయ్ కుమార్, ఒంగోలు టు టౌన్ సీఐ శ్రీనివాసరావు, ఆర్ఐలు సీతారామిరెడ్డి, రమణా రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు యం.రమణ దీక్షితులు, యం.దక్షణా మూర్తి, సీతారామచంద్ర స్వామి భక్త జన సేవా సమితి సభ్యులు, పోలీస్ సిబ్బంది, ప్రజలు మరియు భక్తులు పాల్గొన్నారు.


