వడదెబ్బ బారిన పడకుండా ప్రజలు ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. శనివారం కలెక్టరేటులో ఏర్పాటుచేసిన చలివేంద్రము, వైద్య శిబిరాన్ని జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాలకృష్ణ , డి.ఆర్.వో. శ్రీ.బి.చిన ఓబులేసులతో కలిసి ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎండలు పెరుగుతున్నందున వడదెబ్బ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వం కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. అత్యవసరమైతే తప్ప ఎండ వేళల్లో బయటకు రావద్దని సూచించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ జంక్షన్లో ద్విచక్ర వాహనాలు ఆగినప్పుడు ప్రజలు ఎండ వేడిమికి గురి కాకుండా షేడ్ నెట్స్ ఏర్పాటు చేశామన్నారు. వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేశామన్నారు. డీహైడ్రేషన్ కు గురికాకుండా చూసుకోవాలని, గాలి ఆడే దుస్తులు ధరించాలని సూచించారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో డిఆర్ఓ రక్తపోటు, మధుమేహ వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ ఓ వెంకటేశ్వర్లు, కలెక్టరేట్ లోని వివిధ సెక్షన్ల సూపరింటెంట్లు, ఉద్యోగులు పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు.

