ప్రకాశం జిల్లా, కొమరోలు మండలం, తాటిచెర్ల మోటు వద్ద శుక్రవారం కారు, లారీ ఢీకొని ఆరుగురు మృతి చెందగా మరో ఇద్దరు చిన్నారులు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో తాటిచెర్ల మోటు గ్రామానికి చెందిన పాశం బాలవెంకటరెడ్డి కారు వెనుక భాగంలోని అద్దాన్ని పగలగొట్టి ఇద్దరు చిన్నారులను వెలికి తీసి గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు కృషి చేశాడు. ఈ విషయాన్ని గుర్తించిన కొమరోలు ఎస్ఐ నాగరాజు విషయాన్ని డిఎస్పి నాగరాజు దృష్టికి తీసుకువెళ్లారు. ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ ఆదేశాల మేరకు మార్కాపురం డీఎస్పీ నాగరాజు బాల వెంకట రెడ్డికి శనివారం నగదు రివార్డును అందిస్తూ ప్రత్యేకంగా అభినందించారు. ప్రతి ఒక్కరూ కష్టకాలంలో ఇలానే స్పందించాలని డి.ఎస్.పి నాగరాజు అన్నారు. బాల వెంకటరెడ్డి చేసిన సహాయాన్ని వెలకట్టలేనిదని కొనియాడారు.
