హైదరాబాద్ జూన్ 25(జే ఎస్ డి ఎం న్యూస్):
వైద్య రంగం లో విశేష సేవలు అందించిన డాక్టర్ వీరవల్లి శరత్ చంద్రమౌళికి లండన్లోని రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ నుంచి ఫెలోషిప్ లభించింది. ఇది ప్రపంచంలోనే ప్రఖ్యాత సంస్థ నుంచి అందిన అతిపెద్ద గౌరవం. వైద్యరంగంలో సాధించిన విజయాలు, ఈ రంగానికి చేసిన అసాధారణ సేవలకు గాను డాక్టర శరత్ చంద్రమౌళికి ఈ ఫెలోషిప్ ప్రకటించారు. లండన్లోని రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ ప్రెసిడెంట్ డాక్టర్ ముంతాజ్ పటేల్ ఈ సర్టిఫికెట్పై సంతకం చేశారు.
సికింద్రాబాద్లోని కిమ్స్ ఆస్పత్రిలో పేరొందిన రుమటాలజిస్టుగా సేవలందిస్తున్న డాక్టర్
వీరవల్లి శరత్ చంద్రమౌళి సుదీర్ఘకాలంగా ఈ రంగంలో అసమాన సేవలు అందిస్తున్నారు. వైద్య ప్రమాణాలను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లడం, రోగులకు అందే చికిత్సలను మరింత మెరుగుపరచడంలో ఆయన నిబద్ధత కారణంగా ఆయనకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.
కిమ్స్ ఆస్పత్రిలో కన్సల్టెంట్ రుమటాలజిస్టుగా సేవలందిస్తున్న డాక్టర్ శరత్ చంద్రమౌళికి రుమటాలజీ, క్లినికల్ ఇమ్యునాలజీలలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది. వైద్యరంగం అంటే అపారప్రేమాభిమానాలు ఉన్న ఆయన.వైద్యం చేయడంతో పాటు అనేకమంది పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు, రుమటాలజిస్టులకు శిక్షణ అందించారు. దాంతోపాటు ప్రజారోగ్య కార్యక్రమాలు,వైద్య పరిశోధనల్లో నిరంతరం పాల్గొంటారు. దేశ విదేశాల్లో కంటిన్యుయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ (సీఎంఈ) కార్యక్రమాలు నిర్వహించారు.
1518లో స్థాపించిన రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్.. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన వైద్య సంస్థల్లో ఒకటి. వైద్యవిద్య, వృత్తిప్రమాణాల్లో అత్యున్నత ప్రమాణాలను ఇది నిర్దేశిస్తుంది. ఇలాంంటి అసాధారణ సంస్థ నుంచి ఎఫ్ఆర్సీపీ లభించడం అంటే వైద్యవృత్తిలో అంతర్జాతీయ స్థాయిలో అందించిన సేవలకు గుర్తింపుగానే భావించాలి.
ఈ సందర్భంగా డాక్టర్ శరత్ చంద్రమౌళి మాట్లాడుతూ, “ఈ గౌరవం అనేది కేవలం తనకు వ్యక్తిగతంగా లభించిన గుర్తింపు మాత్రమే కాదు. నా ఈ ప్రయాణాన్ని రూపుదిద్దిన తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, అధ్యాపకులు, స్నేహితులు, పేషెంట్లు. వీరందరి సమైక్య కృషి ఫలితమే. ఈ సమాజ సంక్షేమం, ఆరోగ్యం కోసం నేను మరింత అర్థవంతంగా కృషి చేయడాన్ని కొనసాగిస్తూనే ఉంటాను” అని తెలిపారు.
భారతీయ వైద్యుల్లో కొత్త తరానికి ఈ గుర్తింపు అనేది ఒక స్ఫూర్తిగా నిలుస్తుంది. అంతర్జాతీయ వైద్య రంగంలో భారతదేశ నాయకత్వం మరింత ఎదుగుతుందనడానికి ఇదొక నిదర్శనం అన్నారు.
ఈ అసాధారణ విజయం సాధించినందుకు డాక్టర్ వీరవల్లి శరత్ చంద్రమౌళిని కిమ్స్ ఆస్పత్రుల సీఎండీ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు, కిమ్స్ వైద్య బృందం, ఇండియన్ రుమటాలజీ అసోసియేషన్ నేషనల్ చాప్టర్, ఇండియన్ రుమటాలజీ అసోసియేషన్ హైదరాబాద్ చాప్టర్ సభ్యులు మనస్ఫూర్తిగా అభినందించారు. రోగులకు చికిత్స, వైద్యపరమైన నైతిక ప్రమాణాలు, వైద్యరంగంలో నిరంతర పురోగతి దిశగా ఆయన చూపిన నిబద్ధతకు
ఈ ఫెలోషిప్ ఒక గుర్తింపు.
