పోలీస్ స్టేషన్ స్థితిగతులు, సిబ్బంది పని తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించడానికి టంగుటూరు పియస్ ను శనివారం జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్
ఆకస్మికంగా సందర్శించి పోలీస్ స్టేషన్ ఆవరణాన్ని, గదులను, రిసెప్షన్ కౌంటర్, స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకున్నారని… ఇలానే కొనసాగించాలన్నారు. స్టేషన్ నిర్వహణ రికార్డులు, పట్టుబడిన ద్విచక్ర వాహనాలు మరియు ఇతర వస్తువులు తనిఖీ చేసి వాటిని త్వరగా డిస్పోజల్ చేయాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో లా అండ్ ఆర్డర్, నేర నివారణ వ్యూహాలపై తీసుకుంటున్న చర్యలపై అధికారులను ఆరా తీసి పలు సూచనలు చేసారు. పోలీస్ స్టేషన్ లో పెండింగ్ కేసుల వివరాలు తెలుసుకొని వాటిని త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేయాలన్నారు.
పోలీస్ స్టేషన్ కు వచ్చే వారి నుండి ఫిర్యాదులు స్వీకరించాలని, వారితో మర్యాదగా, గౌరవంగా నడుచుకోవాలన్నారు. ప్రతి ఫిర్యాదు పై వెంటనే త్వరితగతిన స్పందించి, ప్రాథమిక విచారణను వేగంగా నిర్వహించి బాధితులకు భరోసా కల్పించాలని ఆదేశించారు. ఫిర్యాదుల స్వీకరణ, కేసుల నమోదులో ఎలాంటి జాప్యం ఉండవద్దని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.
స్టేషన్లో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు,వారి విధుల వంటి వాటిపై ఆరాతీశారు. రాత్రి వేళల్లో పోలీసులు పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని, గస్తీ విధులు పటిష్టంగా నిర్వర్తించి నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. బీట్లు తిరిగే సమయంలో హిస్టరీ షీట్లు కలిగిన వారిని చెక్ చేయాలని, వారి కదలికలపై నిఘా పెట్టాలని, విజిబుల్ పోలీసింగ్ నిర్వహించాలన్నారు. స్టేషన్లో పని చేస్తున్న సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని, వారి సమస్యలను తెలుసుకుని పరిష్కార చర్యలు చేపట్టాలన్నారు.
ఈ అకస్మిక తనిఖీలో జిల్లా ఎస్పీ
ఏ.ఆర్. దామోదర్
వెంట ఎస్ బి ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, సింగరాయకొండ సిఐ హాజరత్తయ్య, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పాండురంగారావు, టంగుటూరి ఎస్సై నాగమల్లేశ్వరరావు మరియు సిబ్బంది ఉన్నారు.


