రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన లక్ష్యమని, అందులో భాగంగా ఉద్యాన పంటలను ప్రోత్సహిస్తూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా 25 వేల ఎకరాలలో పండ్ల మొక్కలను నాటడం జరుగుచున్నదని జిల్లా ఇంచార్జి కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ పేర్కొన్నారు.
జిల్లా వ్యాప్తంగా అన్నీ నియోజక వర్గాలలో జరుగుచున్న హార్టికల్చర్ ప్లాంటేషన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం కొత్తపట్నం మండల కేంద్రంలో జిల్లా ఇంచార్జి కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ, ఒంగోలు శాసన సభ్యులు దామచర్ల జనార్దన్ రావుతో కలసి కొబ్బరి మొక్కలను నాటడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జి కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ మాట్లాడుతూ… రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన లక్ష్యమని, అందులో భాగంగా ఉద్యాన పంటలను ప్రోత్సహిస్తూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా 25 వేల ఎకరాలలో పండ్ల మొక్కలను నాటడం జరుగుచున్నదన్నారు. అందులో భాగంగా జిల్లాలోని 8 నియోజక వర్గాల్లో 750 ఎకరాలలో పండ్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించడం జరిగిందన్నారు. ఈ రోజు కొత్తపట్నంలో హార్టికల్చర్ ప్లాంటేషన్ కార్యక్రమం కింద మొక్కలను నాటడం జరిగిందన్నారు. ఈ పధకం కింద మామిడి, బత్తాయి, తైవాన్ జామ, నేరేడు, ఆపిల్ బేర్, చింత, అంజూర, డ్రాగన్ ఫ్రూట్, మునగ, గులాబీ, మల్లె, జామ, దానిమ్మ, కొబ్బరి, సీతాఫలం, సపోటా, నిమ్మ తదితర పంటల సాగుకు ఆర్ధిక సాయం అందించనున్నారన్నారు. నేడు డ్రాగన్ ఫ్రూట్ కు మంచి డిమాండ్ ఉన్నదన్నారు. రైతులు కోరుకున్న పండ్ల మొక్కలను ఇవ్వడం జరుగుతుందన్నారు. ఉద్యానవన పంటల సాగుకు ఉపాధి నిధులను మంజూరు చేయడం జరుగుతుందని, మొక్కల సంరక్షణ చాలా ముఖ్యమని, దీనికి గాను నిధులు కూడా మంజూరు చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలోని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఒంగోలు శాసన సభ్యులు దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ, పేద రైతుల ఆదాయం వృద్ధి చెందాలన్న లక్ష్యం తో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా హార్టికల్చర్ ప్లాంటేషన్ కింద 25 వేల ఎకరాల్లో పండ్ల మొక్కలు నాటే కార్యక్రమం అన్నీ నియోజక వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుచున్నదన్నారు. పేద రైతులకు ఆర్ధిక భరోసా కల్పించాలన్న లక్ష్యంతో ఉద్యాన పంటలను ప్రోత్సహిస్తూ ఉపాధి హామీ పధకం కింద పండ్ల మొక్కలను నాటే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందన్నారు. రైతు సాగు చేస్తున్న పండ్ల మొక్కలను బట్టి విడతల వారీగా ఉపాధి హామీ పధకం కింద ఆర్ధిక సహాయం చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ సదుపాయాన్ని ప్రతి పేద రైతు సద్వినియోగం చేసుకొని ఆర్ధికంగా వృద్ది చెందాలన్నారు.
ఈ కార్యక్రమంలో డ్వామా పిడి జోసెఫ్ కుమార్, డి పి ఓ వెంకట నాయుడు, కొత్త పట్నం మండల తహసీల్దార్ శాంతి, ఎంపిడిఓ శ్రీకృష్ణ, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

