మాదకద్రవ్యాల నిర్మూలన, ప్రజల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా, ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తును కాపాడే దిశగా ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న పోలీస్ అధికారులు మరియు సిబ్బంది కలిసి పాఠశాలలు, కళాశాలలు (ఇంజినీరింగ్ కాలేజీలు) పరిసరాలలో గంజాయి మరియు నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయం, నిల్వ, రవాణాపై సిగరెట్లు మరియు ఇతర పొగాకు ఉత్పత్తుల నిషేధ చట్టం ప్రకారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్లో భాగంగా అనుమానిత కిరాణా షాపులు, బడ్డీ కొట్లు, కిళ్లీ షాపులపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మాదక ద్రవ్యాలపై కఠిన చర్యలతో పాటు విద్యార్థులకు మరియు స్థానిక ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు కూడా నిర్వహించారు.
పాఠశాలలు, కళాశాలల సమీపంలోని కిరాణా దుకాణాలు, పాన్ షాపులు, ఇతర వ్యాపార కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, 100 మీటర్ల పరిధిలో పొగాకు ఉత్పత్తుల విక్రయాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకున్నారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారి పై చట్టం ప్రకారం, అలాగే గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాల విక్రయం, నిల్వ, రవాణా చేసిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు తెలిపారు. పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా, విద్యార్థులలో అవగాహన పెంపొందించడంపైనా ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ప్రత్యేక డ్రైవ్లో భాగంగా జిల్లాలోని వివిధ పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహించారు. మాదకద్రవ్యాలు మరియు పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక మరియు చట్టపరమైన దుష్ప్రభావాలను విద్యార్థులకు వివరించారు.
ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్. దామోదర్ మాట్లాడుతూ… మాదకద్రవ్యాలు మరియు గంజాయి ఉచ్చు నుండి యువతను రక్షించడం మనందరి సామాజిక బాధ్యత. పాఠశాలలు, కళాశాలల పరిసరాలను ఈ చెడు వ్యసనాల నుండి దూరంగా ఉంచటం, విద్యార్థుల భవిష్యత్తును రక్షించడం మనందరి బాధ్యతన్నారు. యువతను పాడు చేసే మత్తు పదార్థాలు, పొగాకు ఉత్పత్తుల నిల్వలు కలిగి ఉన్న, అక్రమంగా వాటిని విక్రయాలు జరిపిన ఏ మాత్రం ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. విద్యార్థులలో అవగాహన పెంపొందించడానికీ కృషి చేస్తున్నామన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తమ పిల్లలపై దృష్టి పెట్టి వారికి సరైన మార్గదర్శనం ఇవ్వాలని, మాదకద్రవ్యాలు లేని ఆరోగ్యకర సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాలు, నిషేధిత పొగాకు ఉత్పత్తులకు సంబంధించిన సమాచారం ఉన్నట్లయితే పోలీసులకు వెంటనే తెలియజేయాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. ప్రకాశం జిల్లా పోలీసులు ఈ ప్రత్యేక డ్రైవ్ను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తూ, జిల్లాను మాదకద్రవ్యాలు లేని జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు.


