ఎన్నికల ముందు చెప్పిన విధంగా హామీలను అమలు చేయడంతో పాటు కూటమి ప్రభుత్వం ముందుగా చెప్పనవీ ఎన్నో చేస్తుందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లా కనిగిరి లో సుపరిపాలన తొలి అడుగు, ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కనిగిరి, చంద్రశేఖరపురం, వెలిగండ్ల మండలాల రైతుల కోసం మూడు డ్రోన్లను అందజేశారు. ఒక్కో డ్రోన్ విలువ రూ.10 లక్షలు ఉంటుందని… ఇందులో 8 లక్షలు ప్రభుత్వం సబ్సిడీగా భరిస్తుందని తెలిపారు. రైతులు వ్యవసాయంలో ఆధునికతను అందిపుచ్చుకుని లబ్ధి పొందాలని సూచించారు. లాభసాటి వ్యవసాయంతోనే రైతులకు లబ్ధి చేకూరుతుందని అన్నారు.
అనంతరం కనిగిరి మున్సిపాలిటీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. లబ్ధిదారులతో సమావేశమైన మంత్రి… హామీలు, సంక్షేమ పథకాల అమల తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఒక్క ఏడాదిలోనే ఆరోగ్య శ్రీ పథకంలో పాటు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా రూ.400 కోట్లను కూటమి ప్రభుత్వం ఖర్చు చేసిందని మంత్రి వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వానికి పేదల ఆరోగ్యం పట్ల ఉన్న చిత్త శుద్ధికి ఇదే నిదర్శనమన్నారు.
విద్యుత్ వినియోగం ప్రతి ఏడాది 6 నుంచి 8 శాతానికి పెరుగుతున్నా…. అందుకు తగిన విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం చేనేత, పవర్ లూమ్స్ కు ఇప్పటికే ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. బార్బర్ షాపులకు కూడా త్వరలోనే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తామని మంత్రి ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ 24 గంటలు నిరంతర విద్యుత్ అందించేందుకు సబ్ స్టేషన్లు, కొత్త లైన్లు వేస్తున్నట్లు చెప్పారు. సూర్యఘర్ పథకం ద్వారా సోలార్ విద్యుత్ పథకంలో రాష్ట్ర ప్రజలు భాగమవ్వాలని పిలుపునిచ్చారు. సోలార్ విద్యుత్ వల్ల కరెంట్ బిల్లులు తగ్గడంతో పాటు పవర్ లాసెస్ కూడా అదుపులో ఉంటాయని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక కూటమి నేతలు పాల్గొన్నారు.


