- శబ్దం చేసే సైలెన్సర్లపై ఉక్కుపాదం… ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు -జిల్లా ఎస్పీ -ట్రాఫిక్ నియమాలు మీ భద్రతకే…ప్రతి వాహనదారుడు బాధ్యతగా వ్యవహరించాలి -సురక్షిత ప్రయాణానికి ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు మరియు రోడ్డు భద్రత నియమాలను పాటించాలి: జిల్లా ఎస్పీ ఏ.ఆర్ దామోదర్
జిల్లాలోని శాంతిభద్రతలు, నేరాలు నియంత్రణ, వాహనదారుల ట్రాఫిక్ ఉల్లంఘనలు నివారించడం, రోడ్డు భద్రతా నియమాలను పాటించేలా చూడటమే లక్ష్యంగా ఒంగోలు టౌన్ పరిధిలో విపరీతమైన ధ్వని పుట్టించే సైలెన్సర్ల బైకర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. గత ఆరు నెలలో ఒంగోలు టౌన్ పరిధిలో ట్రాఫిక్ పోలీస్ లు ప్రత్యేక తనిఖీలు చేపట్టి ద్విచక్ర వాహనాలకు మాడిఫైడ్ సైలెన్సర్ల ద్వారా అధిక శబ్దం చేసే 550 సైలెన్సర్ లను (సుమారు 25 లక్షలు విలువ గల) వాటిని శుక్రవారం జిల్లా ఎస్పీ ఏ.ఆర్ దామోదర్
ఒంగోలులోని మంగమూరు రోడ్డు, రత్నదీప్ స్టోర్సెంటర్ వద్ద రోడ్ రోలర్ తో ధ్వంసం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీఏ.ఆర్ దామోదర్ మాట్లాడుతూ ….కొంతమంది ఆకతాయిలు రోడ్లపై, కాలేజీల వద్ద, బహిరంగ ప్రదేశాలలో బైకులకు అధిక శబ్దం చేసే మాడిఫైడ్ సైలెన్సర్లు అమర్చుకుని భయాందోళన కలిగిస్తున్నారన్నారు. దీనివల్ల శబ్ద కాలుష్యం ఏర్పడి, ప్రజలకు ఎంతో నష్టం కలుగుతోందన్నారు. అనుమతిలేని మాడిఫైడ్ సైలెన్సర్ల వలన బైక్లు చేసే గట్టిగా శబ్దం వృద్ధులకు, చిన్నారులకు, ఇతర రోడ్డుపై ప్రయాణిస్తున్నవారికి తీవ్రమైన అసౌకర్యాన్ని కలిగిస్తోందని, ఇది కేవలం అసౌకర్యం మాత్రమే కాకుండా, ధ్వని కాలుష్యానికి దారితీస్తుందన్నారు. దీని వలన మానసిక ఒత్తిడి, హృదయ సంబంధిత సమస్యలు వంటి ఆరోగ్యపరమైన ప్రభావాలు ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. మోటార్ వాహనాల చట్టాన్ని ఉల్లంఘిస్తూ వాహన తయారీదారులు ఇచ్చిన ఒరిజినల్ సైలెన్సర్ను తొలగించి, అధిక శబ్దం చేసే సైలెన్సర్ అమర్చిన ద్విచక్ర వాహనాలను ఉపేక్షించమన్నారు. ఇటువంటి వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని, శబ్ద కాలుష్యం సృష్టించే బైకులపై చట్టపరమైన చర్యలు చేపట్టి, జరిమానాలు విధిస్తామని స్పష్టం చేశారు.
మాడిఫైడ్ సైలెన్సర్లను ఉపయోగించడం మోటార్ వాహనాల చట్టం కింద నేరమని, ప్రజల భద్రత, శాంతి భద్రతలను కాపాడటం పోలీసుల బాధ్యత అని తెలిపారు. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొంతమంది ఆకతాయిలకు కౌన్సిలింగ్ నిర్వహించటం జరిగినట్లు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి డ్రైవ్లు కొనసాగుతాయని, మాడిఫైడ్ సైలెన్సర్లను ఉపయోగించవద్దని, ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దని ప్రజలకు, ముఖ్యంగా యువతకు విజ్ఞప్తి చేశారు. సమాజంలో శాంతియుత వాతావరణాన్ని కాపాడటానికి అందరి సహకారం అవసరమన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను పాటించండి, అనవసరమైన శబ్ద కాలుష్యానికి దూరంగా ఉండండి. తల్లిదండ్రులకు మీ పిల్లలు మాడిఫైడ్ సైలెన్సర్లు వాడకుండా చూడలని, ఇది చట్టవిరుద్ధమే కాక, ప్రజలకు ఇబ్బంది కలిగించే చర్య అని అన్నారు. హెల్మెట్ ధరించిన వాహనదారులను జిల్లా ఎస్పీ అభినందించారు.
త్రిబుల్ రైడింగ్, డ్రైవింగ్ లైసెన్స్, నెంబర్ ప్లేట్స్ లేని వాహనాలు, ఓవర్ స్పీడ్, మాడిఫైడ్ సైలెన్సర్లు ఉన్న ద్విచక్ర వాహనాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవటం జరుగుతుందని, వాహనాల నెంబర్ ప్లేట్లు యం.వి యాక్ట్ నిబంధనల ప్రకారం ఉండాలని,వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్,రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ ఇతర ధ్రువపత్రాలు కలిగి ఉండాలన్నారు.
జిల్లా ఎస్పీ వెంట కనిగిరి డిఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ , ఒంగోలు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పాండు రంగారావు, ట్రాఫిక్ ఎస్సైలు కోటయ్య, శ్రీనివాసరావు, శివప్రసాద్ మరియు సిబ్బంది ఉన్నారు.



