అన్నదాతల అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ ద్వేయమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు. సోమవారం నాడు సింగరాయకొండలో వ్యవసాయ మార్కెట్ కమిటీ తొలి సమావేశంలో ముఖ్య అతిథిగా మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ…..వ్యవసాయ మార్కెట్ల బలోపేతం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే జరిగిందన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని సింగరాయకొండ, టంగుటూరులో ఉన్న జామాయిల్ తోటలను వేలం వేసి ఆ సొమ్మును వ్యవసాయ మార్కెట్ కమిటీకి జమ చేయాలనే తీర్మానాన్ని స్వాగతిస్తున్నామన్నారు. మాజీ మంత్రి దివంగత దామచర్ల ఆంజనేయులు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కొండపి వ్యవసాయ మార్కెట్ల, గోడౌన్ల అభివృద్ధికి కృషి చేశారన్నారు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్ కమిటీల నిర్వహణ గాలికి వదిలేసి దళారులను ప్రోత్సహించి రైతుల పొట్ట కొట్టిందన్నారు. మామిడి, మిర్చి, ఉల్లి పంటలకు ధరలు పతనమైనప్పుడు కూటమి ప్రభుత్వం మద్దతు ధరతో రైతులను ఆదుకున్న విషయాన్ని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాణ్యమైన,విత్తనాలు ఎరువులు అందించడం మూలాన రాష్ట్రంలో పంటల దిగుబడులు పెరిగాయి అన్నారు. రైతులను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వైపు తీసుకుపోయే విధంగా వ్యవసాయ డ్రోన్లు, వ్యవసాయ పనిముట్లు రాయితీపై అందిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ. 6000 కలుపుకొని అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి రూ.20,000 చెల్లిస్తున్నామని మొదటి విడత 6000 ఇచ్చామని మిగతా రెండు విడతలు కూడా త్వరలో విడుదల చేస్తామన్నారు. రైతుల సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి తెలిపారు.

