అల్వాల్ జులై 7,(జే ఎస్ డి ఎం న్యూస్) :
రహదారినియమాలను చిన్న వయస్సు నుంచేఅలవర్చుకోవడం ద్వారా సురక్షిత సమాజ నిర్మాణానికి పునాది పడుతుందని మల్కాజిగిరి సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎంకెల్యుఎస్సీ) అసోసియేట్ డైరెక్టర్ సావిత్రి తెలిపారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ రెడ్డి మార్గదర్శకత్వంలో ఆల్వాల్ ట్రాఫిక్ పోలీసులు మంగళవారం ఓల్డ్ ఆల్వాల్లోని లయోలా అకాడమీలో విద్యార్థులకు రహదారి భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రి మాట్లాడుతూ, విద్యార్థులు తమ కుటుంబాల్లో, స్నేహితుల్లో అవగాహన కల్పిస్తూ రోడ్ సేఫ్టీ రాయబారులుగా మారాలని పిలుపునిచ్చారు.
ఈ సదస్సులో తిరుమలగిరి ట్రాఫిక్ ఏసీపీ జి. శంకర్ రాజు, ఆల్వాల్ ట్రాఫిక్ సీఐ జి. పవన్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొని విద్యార్థులకు హెల్మెట్, సీటు బెల్ట్ ధరించడం, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం వంటి నిబంధనలను వివరించారు. అతివేగం, రాంగ్ సైడ్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, డ్రైవింగ్ చేస్తూ మొబైల్ వాడటం వల్ల జరిగే ప్రమాదాలపై హెచ్చరించారు. దాదాపు 500 మందికి పైగా విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ట్రాఫిక్ నియమాలను పాటించాలని అధికారులు కోరారు. లయోలా అకాడమీ ప్రిన్సిపాల్ ఫాదర్ బాబు, వైస్ ప్రిన్సిపాల్ ఫాదర్ జోసెఫ్ కుమార్, ఫోరం లీడ్ మురళీకృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.



