హైదరాబాద్, జూలై 11 (జే ఎస్ డి ఎం న్యూస్) :
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో జరిగిన ఘటన పై రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గద్వాల విజయలక్ష్మి తీవ్రంగా ఖండించారు. సమాజంలో ఇలాంటి అమానుష ఘటనలు జరగడం అత్యంత బాధాకరమన్నారు.
ఈ ఉదంతంపై ఆమె శనివారం బుద్ధభవన్లోని మహిళా కమిషన్ కార్యాలయం నుంచి స్పందించారు. ఘటనకు పాల్పడి ప్రస్తుతం పరారిలో ఉన్న నిందితుడు రాజ్కుమార్ను వెంటనే అరెస్ట్ చేసి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
ఈ విషయమై ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి, చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్లతో చైర్పర్సన్ స్వయంగా ఫోన్ లో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. సమాజంలో మరోసారి ఎవరైనా ఇలాంటి దారుణాలకు పాల్పడాలనే ఆలోచన చేయాలన్నా వెన్నులో వణుకు పుట్టేలా నిందితుడిపై చర్యలు ఉండాలని స్పష్టం చేశారు. తప్పు చేస్తే శిక్ష తప్పదనే భయం ఉన్నప్పుడే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయన్నారు.
ఈ దారుణ ఉదంతం నేపథ్యంలో మహిళలు ఎవరూ భయభ్రాంతులకు గురికావద్దని, బాధిత మహిళలకు అండగా మహిళా కమిషన్ ఎల్లప్పుడూ ఉంటుందని గద్వాల విజయలక్ష్మి భరోసా ఇచ్చారు. మహిళలు ఇటువంటి ఆపద సమయాల్లో తమను తాము రక్షించుకునేలా, త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తామని ఆమె ఈ సందర్భంగా వెల్లడించారు.
