గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత నిస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు. శనివారం ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు చౌటపాలెంలో దర్శి టీడీపీ ఇంఛార్జి గొట్టిపాటి లక్ష్మితో కలసి స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో మంత్రి డిఎస్ బీవీ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి స్వయంగా చెత్త ఊడ్చి రోడ్లు శుభ్రం చేశారు. అనంతరం స్వచ్ఛతపై ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు, గ్రామంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. అనంతరం గ్రామంలోని ఎస్సి కాలనీలో ఎంపీ యూపీ పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి విద్యార్థులు, చిన్నారులతో మంత్రి ముచ్చటించారు. అనంతరం నిర్వహించిన సభలో మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ…గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోంది. మన ఇల్లు, మన వీధి, మన గ్రామం అనే నినాదంతో ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలి. ప్లాస్టిక్ నిర్మూలనలో ప్రజలంతా భాగస్వాములు కావాలి. గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి పాలనలో గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. సూపర్ సిక్స్ హామీలన్నీ అమలు చేస్తున్నాం. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, దీపం, స్త్రీ శక్తి వంటి అన్ని పథకాలు అమలు చేస్తున్నాం. ఈ నెలలోనే తల్లికి వందనం నిధులు ఇవ్వబోతున్నాం. ప్రధాని మోదీ సహకారం, సీఎం చంద్రబాబు నాయుడు కృషి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తోడ్పాటుతో రాష్ర్టాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నాం. రాష్ట్రానికి
పెట్టుబడుల సాధనలో మంత్రి లోకేష్ కీలకపాత్ర పోషిస్తున్నారు. వైసీపీ హయాంలో వెలిగొండ పూర్తి కాకుండానే జాతికి అంకితం చేసి ప్రజలను మోసం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యుద్ధ ప్రాతిపదికన వెలుగొండ పనులు పూర్తి చేస్తున్నాం, త్వరలోనే వెలిగొండ నీళ్లు ఇచ్చి ఉమ్మడి ప్రకాశం జిల్లాను సస్యశ్యామలం చేస్తామని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు.





