ఒంగోలు నగరంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను వేగవంతం చేయడంపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఒంగోలు మునిసి పాలిటీ ఏర్పడి 150 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో నగర సుందరీకరణ, భవిష్యత్తు అవసరాలు తీర్చేలా మౌలిక వసతులు, అభివృద్ధి పనులను చేపట్టేందుకు జిల్లా కలెక్టర్ శ్రీ.పి.రాజాబాబు, స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన రావు, ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ షేక్ రియాజ్, పీడీసీసీ బ్యాంకు చైర్మన్ కామేపల్లి సీతారామయ్య ఆదివారం నగరంలో విస్తృతంగా పర్యటించారు. కిమ్స్ ఆసుపత్రి ఫ్లైఓవర్ వద్ద జోడు ఎద్దుల విగ్రహాలు, పీ.వీ.ఆర్. బాలుర ఉన్నత పాఠశాల వద్ద ప్రత్యేక పైలాన్, గాంధీ పార్కులో ఓపెన్ ఎయిర్ ధియేటర్, ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.14 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు శిలాఫలకం ఆవిష్కరణ, పీడీసీసీ బ్యాంకులో చేపట్టిన ఆధునీకరణ పనుల ప్రారంభోత్సవం, మినీ స్టేడియంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ వంటి కార్యక్రమాలను ఈ వారంలో చేపట్టడంపై అధికార యంత్రాంగం దృష్టి పెట్టింది. అవకాశముంటే ఈనెల 28వ తేదీన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ఈ పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయించాలని మున్సిపల్ అధికారులు ప్రయత్నిస్తున్నారు.
ఈ పర్యటనలో మునిసిపల్ ఇంజనీర్ యేసయ్య, డీ.ఈ.ఈ. పద్మజ, ఇతర అధికారులు ఉన్నారు.


