ప్రజల్లో సంతృప్తిస్థాయి పెరిగేలా రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు స్పష్టం చేశారు. ఆదివారం ప్రకాశం భవనంలో నిర్వహించిన రెవెన్యూ అధికారుల కాన్ఫరెన్స్ లో ఆయన వివిధ అంశాలపై దిశానిర్దేశం చేశారు. రీ సర్వే, ఈ-కేవైసీ, గ్రౌండ్ ట్రూటింగ్, మ్యుటేషన్లు, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ, రెవెన్యూ గ్రీవెన్స్ అర్జీలు, ఐవిఆర్ఎస్ సర్వేలో సానుకూల అభిప్రాయం పెంపు తదితర అంశాలపై మండలాల వారీగా కలెక్టర్ సమీక్షించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ప్రజలను పలుమార్లు కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దని, అర్జీదారులతో దురుసుగా ప్రవర్తిస్తే ఊరుకోనని హెచ్చరించారు. ముఖ్యంగా రీసర్వే కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేయాలని, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ 80 శాతానికి పైగా పూర్తి కావాలని, గ్రీవెన్స్ అర్జీలను, సేవలు అందుతున్న తీరుపై ప్రభుత్వం నిర్వహిస్తున్న ఐవీఆర్ఎస్ సర్వేలను సీరియస్ గా తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం వీటికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నందున అర్జీదారులతో మాట్లాడి క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.
ఈ సదస్సులో డిఆర్ఓ పి.వి. రమణ, కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశీ, ఒంగోలు, అద్దంకి ఆర్డీవోలు చంద్రశేఖర్ నాయుడు, విజయ జ్యోతి కుమారి, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దారులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, సర్వేయర్లు పాల్గొన్నారు.


