ముండ్లమూరు మండల సర్వసభ్య సమావేశం గరంగరంగా జరిగింది. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న అక్రమాలపై పలువురు ప్రజాప్రతినిధులు నిలదీశారు. మండల పరిషత్ సమావేశపు మందిరంలో మంగళవారం ఎంపీపీ సుంకర సునీత బ్రహ్మానందరెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ మండలంలోని సమస్యలను అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. వేసవి దృష్ట్యా గ్రామాల్లో నీటి సమస్య పై అధికారులు దృష్టి సారించాలన్నారు. సర్వసభ్య సమావేశంలో బృందావనం తండా సర్పంచి జానవత్ లక్ష్మీ బాయి మాట్లాడుతూ …. సర్పంచ్ కు తెలియకుండా ఉపాధి పనులను చేస్తున్నారని పూర్తిస్థాయిలో నిధులు దుర్వినియోగం అవుతున్నాయని ఆరోపించారు. గ్రామంలో లేని వ్యక్తులకు కూడా మస్టర్లు వేస్తూ ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, ఇదేమిటని అడిగితే లెక్క లేకుండా వ్యవహరిస్తున్నారని ఆమె అన్నారు. అంతేకాకుండా అధికారులు, ఫీల్డ్ అసిస్టెంట్లు కుమ్మక్కై నిధులు పంచుకుంటున్నారని ఆమె అన్నారు. పసుపు గళ్ళు ఎంపీటీసీ సభ్యులు దాసరి పెద్ద అంజయ్య మాట్లాడుతూ ఉపాధి పనులు ఉపయోగం లేని చోట చేసి నిధులు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. గ్రామంలో గ్రామ సభలు ఏర్పాటు చేసినప్పుడు తమకు తెలియకుండా గ్రామ సభలు ఏర్పాటు చేసి వారిష్టానుసారంగా పనులు ఎంపిక చేసుకొని ఉపయోగ పడేచోట చేయకుండా పనులు చేస్తున్నారన్నారు. అధికారులు ఆయా శాఖల వారీగా ప్రగతిని సభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కే కుసుమ కుమారి, జడ్పిటిసి తాతపూడి మోజెస్ రత్నం రాజు, వైస్ ఎంపీపీ వేముల పద్మావతి జానకి రామయ్య, వైస్ ఎంపీపీ బంక రమణమ్మ నాగిరెడ్డి, డిప్యూటీ తహసిల్దార్ జి పుల్లారెడ్డి, సర్పంచులు ,ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.



