సికింద్రాబాద్ జిల్లా ఏర్పాటు కోసం జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో సభ్యులు శుక్రవారం సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సికింద్రాబాద్ ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలంటే 7 అసెంబ్లీ నియోజక వర్గాలతో నూతన జిల్లా ఏర్పాటు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్ తెలిపారు. జిల్లా ఏర్పాటైన అనంతరం అమ్మవారికి 1116 కొబ్బరి కాయలు సమర్పిస్తామని అమ్మవారికి మొక్కుకున్నట్లు ఆయన చెప్పారు. జిల్లా ఏర్పాటు ఆవశ్యకత ను వివరిస్తూ సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన హర్యానా గవర్నర్ కేంద్రమంత్రి, ముఖ్యమంత్రి, పలువురు మంత్రులు,ఎమ్మెల్యే లకు వినతిపత్రాలు అందజేయడం జరిగిందని వివరించారు. తాము చేపట్టిన జిల్లా సాధన ఉద్యమానికి అన్ని వర్గాల ప్రజల నుండి సానుకూల మద్దతు లభిస్తుందని చెప్పారు. సికింద్రాబాద్ జిల్లా ఏర్పాటు అవుతుందనే పూర్తి విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ పూజలలో సమితి ప్రధాన కార్యదర్శి సాదం బాల్ రాజ్ యాదవ్, ఉపాధ్యక్షుడు శైలేందర్, సభ్యులు కృష్ణ ముదిరాజ్, అశోక్, శ్రీకాంత్ రెడ్డి, సునీల్ తదితరులు పాల్గొన్నారు.
