ఒంగోలు ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ లో అరుదైన రెండు ఎండోస్కోపిక్ వైద్య విధానాలను విజయవంతంగా నిర్వహించినట్లు కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శ్రావణ్ తుమాటి తెలిపారు. ఎండస్కోపిక్ చికిత్స అనంతరం డాక్టర్ శ్రవణ్ మీడియాతో మాట్లాడుతూ18 సంవత్సరాల యువకుడు తీవ్రమైన ప్యాంక్రియాస్ సమస్యతో పాటు ప్యాంక్రియాస్లో గడ్డ (లంప్)తో ఆసుపత్రికి వచ్చినట్లు ఆయన తెలిపారు. రోగి పరిస్థితి శస్త్రచికిత్సకు అనుకూలంగా లేకపోవడంతో, ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ యంత్రం సహాయంతో స్టెంట్ను అమర్చి, ప్యాంక్రియాస్లో ఏర్పడిన ద్రవాన్ని బయటకు పంపించే విధానం చేపట్టామని చెప్పారు. ఈ చికిత్సతో రోగి త్వరగా కోలుకుని కేవలం మూడు రోజుల్లోనే డిశ్చార్జ్ అయ్యాడన్నారు. శస్త్రచికిత్సపై భయం ఉన్నవారికి ఇటువంటి ఆధునిక ఎండోస్కోపిక్ విధానాలు ఎంతో ఉపయోగకరమని ఆయన వివరించారు.అలాగే 70 సంవత్సరాల వయస్సు గల మహిళ చిన్న ప్రేగుల నుంచి నిరంతర రక్తస్రావంతో ఆసుపత్రికి వచ్చినట్లు తెలిపారు. సాధారణ ఎండోస్కోపీ మరియు కొలొనోస్కోపీ పరీక్షల ద్వారా రక్తస్రావం మూలాన్ని గుర్తించలేకపోయామని చెప్పారు. అనంతరం క్యాప్సూల్ ఎండోస్కోపీ అనే ప్రత్యేక పరీక్షను నిర్వహించామని తెలిపారు. ఈ విధానంలో చిన్న కెమెరా కలిగిన క్యాప్సూల్ను శరీరంలోకి పంపించి రక్తస్రావం జరుగుతున్న ప్రాంతాన్ని గుర్తించి, అనంతరం శస్త్రచికిత్స ద్వారా విజయవంతంగా చికిత్స అందించామని పేర్కొన్నారు.
ఈ రెండు అత్యాధునిక వైద్య విధానాలు ఒంగోలు యూనిట్లో తొలిసారిగా విజయవంతంగా నిర్వహించబడినట్లు ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్, ఒంగోలు క్లస్టర్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ నితిన్ నల్లూరి తెలిపారు.ఈ సందర్భంగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పి. రమేష్ బాబు, మాట్లాడుతూ, ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వైద్య పరికరాలు, నైపుణ్యం కలిగిన మెడికల్ మరియు సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ బృందం, శిక్షణ పొందిన అనస్థీషియా మరియు ఐసీయూ సదుపాయాలతో అన్ని రకాల జీర్ణాశయ సంబంధిత సమస్యలకు సమగ్ర వైద్యం అందిస్తున్నామని తెలిపారు.
