తెలంగాణలో ఆగస్టు 1 నుంచి వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, స్థిరాస్తుల కొత్త రిజిస్ట్రేషన్ల ఛార్జీలు అమల్లోకి……….

తెలంగాణా లో ఆగస్టు ఒకటి నుంచి వ్యవసాయ, వ్యవసాయేతర భూములు,స్థిరాస్తుల కొత్త రిజిస్ట్రేషన్ చార్జీలు అమలులోకి రానున్నాయి. రాష్ట్రంలో భూముల మార్కెట్‌ విలువలను సవరించాలని ఇటీవలే ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా క్షేత్రస్థాయిలో విలువను అంచనా వేసేందుకు స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ కార్యాచరణ ప్రారంభించింది. పాతవిలువను సవరించి కొత్త విలువను అమల్లోకి తెచ్చేందుకున్న పరిస్థితిపై అధ్యయనం చేపట్టనుంది.ఈనెల 18న అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలతో స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు ప్రాథమిక సమావేశం నిర్వహించి కార్యక్రమం ప్రారంభించనున్నారు. దశల వారీగా పరిశీలన పూర్తి చేసి జులై 1న కొత్త రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను ఖరారు చేయనున్నారు. అనంతరం పలు దశల్లో పరిశీలన పూర్తి చేసి తుది మార్కెట్‌ విలువలను ఖరారుచేస్తారు. మండల, జిల్లా స్థాయిలోని కమిటీల పరిశీలన తర్వాత ఆగస్టు నుంచి నూతన మార్కెట్‌ విలువలు అమలు చేసేలా స్టాంపులు-రిజిస్ట్రేషన్లశాఖ ఏర్పాట్లు చేస్తోంది.గ్రామీణ, పట్టణ ప్రాంతాల వారీగా మార్కెట్‌ విలువల సవరణలో అనుసరించాల్సిన మార్గదర్శకాలను స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ జారీ చేసింది. క్షేత్రస్థాయిలో సవరించాల్సిన మార్కెట్‌ విలువలు వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేలా జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఆ శాఖ కమిషనర్‌ నవీన్‌మిత్తల్‌ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ, పంచాయతీరాజ్, సర్వే-ల్యాండ్‌ రికార్డ్స్, పురపాలక శాఖ నుంచి సహకారం తీసుకోవాలని సూచించారు.గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విలువ సవరణలు చేయనున్నారు. జాతీయ, రాష్ట్రరహదారుల్లో ఉన్న గ్రామాలను గుర్తించనున్నారు. అక్కడ వ్యవసాయేతర వినియోగానికి అనువైన ప్రాంతాలు, పరిశ్రమలు, సెజ్‌లు తదితర ప్రాంతాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఆయా ప్రాంతాల్లో బహిరంగ భూముల ధరలని లెక్కలోకి తీసుకొని మార్కెట్‌ విలువ సవరిస్తారు. భూముల ధరలు క్రమంగా పెరగడం లేదా తగ్గుతుండటాన్ని ప్రత్యేకంగా పరిశీలిస్తారు. ఆ తర్వాత వ్యవసాయ భూముల విషయంలో రెవెన్యూ, పంచాయతీ అధికారుల సూచనతో బహిరంగ మార్కెట్‌ ధరలపై అంచనాకి రానున్నారు.ఇక పురపాలక సంఘాలు, కార్పొరేషన్లలో స్థానిక ప్రాంతాలను అనుసరించి విలువను నిర్ధారిస్తారు. వాణిజ్య ప్రాంతాలు, ప్రధాన రహదారులున్న చోట ఆ ప్రాంతానికి అనుగుణంగా విలువను నిర్ణయిస్తారు. కాలనీలు, అంతర్గత రహదారుల ప్రాంతాలు, మౌలిక వసతులు-అభివృద్ధి చెందిన ప్రాంతాల్లోనూ పాత విలువతో పోల్చి అవసరమైతే సవరిస్తారు. పెంపు లేదా తగ్గింపు చేపట్టడానికి వీలుంది. పురపాలక, నగర పాలక సంస్థల్లో కొత్తగా చేరిన గ్రామాల్లో స్థానిక విలువను బట్టి క్షేత్రస్థాయి ధరలను ప్రతిబింబించేలా సవరణ చేపట్టనున్నారు…

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *