ఇంగ్లాడ్ లోని కెంట్ రాష్ట్రం, హాడ్లో గ్రామంలో ప్రవాస (తెలుగు) భారతీయులు జూలై 7వ తేదీ ఆదివారం సాయంత్రం 5:30 గం.లకు (భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గం.లు) ఆల్ ఇండియా కళారంగం, పద్మశ్రీ ఘంటసాల స్వరాంజలి ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన “పాటల సందడి” లో ఓలలాడారు.
కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ఆలిండియా కళారంగం మరియు పద్మశ్రీ ఘంటసాల స్వరాంజలి సంస్థ అధ్యక్షురాలు, స్వర్ణ కంకణ గ్రహీత డాక్టర్ చల్లా నాగేశ్వరమ్మ ముఖ్యఅతిథిగా పాల్గొని తమ మధురమైన కంఠంతో ఘంటసాల మాస్టర్ ఆలపించిన భక్తి సినీ గీతాలను మరియు ఉషారైన సినీ గీతాలు… ఆకాశంలో ఆశల హరివిల్లు, చిలుకా క్షేమమా, నన్ను దోచుకుందువటే, పూచింది పూచింది పున్నాగా, ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరుపల్లె తుళ్లు, మధుర మధుర తర మీనాక్షి కాశీలో విశాలాక్షి, ఆరడుగులు ఉంటాడా, భంభం భోలే, అత్తలేని కోడలు ఉత్తమురాలు మరియు తదితర పాటలను ఆలపించారు. పాటల సందడిలో గాయని గాయకులు సౌజన్య, జ్యోతి, రాజా మరియు చక్రిలు పాల్గొని చక్కని పాటలను పాడారు. ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో విచ్చేసిన ప్రవాస భారతీయ కుటుంబ సభ్యులు వీనుల విందైన తెలుగు గీతాల ఒరవడిలో తేలియాడారు, ఉత్సాహంగా నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా చల్ల మాలకొండయ్య డాక్టర్ చల్లా నాగేశ్వరమ్మ దంపతులకు స్థానిక ప్రవాస భారతీయులు ఒకరికొకరు పోటీ పడుతూ ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా నాగేశ్వరమ్మ మాట్లాడుతూ ప్రపంచ పటంలో భూమిపై ఏ మూలకు వెళ్లినా… తెలుగు వారి జాడ కనిపిస్తుంది, ఘంటసాల పాట వినిపిస్తుందని, మహోన్నతమైన తెలుగు గీతాలకు ఆహా అంటూ మైమరచి తలలు ఊపనివారు, పాదాలను లయబద్ధంగా కదపని వారు ఉండరని పేర్కొన్నారు. ఇంగ్లాండులో కళా రంగం, పద్మశ్రీ ఘంటసాల స్వరాంజలి తరపున ఆదివారం పాటల తో సందడి చేయడం మధురానుభూతిని మిగిల్చిందని కార్యనిర్వహణ చేసిన చల్ల పవన్ కుమార్, దీపిక మరియు వారి మిత్ర బృందానికి, యాంకరింగ్ చేసిన వంశీ, కృష్ణ లకు ప్రవాస భారతీయులందరికీ ధన్యవాదాలు తెలిపారు.
ఇంగ్లాండులో అద్భుతంగా పాటలతో సందడి చేసిన డాక్టర్ చల్లా నాగేశ్వరమ్మను ఆల్ ఇండియా కళా రంగం ప్రకాశం జిల్లా సభ్యులు పలువురు చల్లా నాగేశ్వరమ్మకు చరవాణి ద్వారా, వాట్సప్ మాధ్యమం ద్వారా అభినందనలు తెలిపారు.



