దక్షిణ మద్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారిగా ఎ. శ్రీధర్ మంగళవారం సికింద్రాబాద్ రైల్ నిలయం లో పదవీ బాధ్యతలు స్వీకరించారు. వీరు ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ (ఐ. ఆర్. టి. ఎస్) 2011 బ్యాచ్కి చెందినవారు. ఈ నియామకానికి ముందు దక్షిణ మధ్య రైల్వేలో డిప్యూటీ జనరల్ మేనేజర్ (జనరల్)గా పనిచేసారు. ప్రస్తుతం ముఖ్య ప్రజా సంబంధాల అధికారిగా పనిచేస్తున్న సి. హెచ్. రాకేష్ దక్షిణ మద్య రైల్వే డిప్యూటీ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ (ట్రాఫిక్ & ఆర్పిఎఫ్)గా బదిలీ అయినారు. ఎ. శ్రీధర్ ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎం. ఏ పట్టా పొందారు.
వీరు మొదట దక్షిణ మద్య రైల్వే యొక్క సికింద్రాబాద్ డివిజన్, భద్రాచలం రోడ్ లో ఏరియా ఆఫీసర్ గా భారతీయ రైల్వేలో తన ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు. తదుపరి రామగుండం ఏరియా ఆఫీసర్ గా, హైదరాబాద్ & సికింద్రాబాద్ డివిజన్ లలో డివిజనల్ కమర్షియల్ మేనేజర్ గా, సికింద్రాబాద్ డివిజన్ లో డివిజనల్ ఆపరేషన్స్ మేనేజర్ గా, హైదరాబాద్ డివిజన్ లో సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ గా, నాందేడ్ డివిజన్ లో సీనియర్ డివిజనల్ ఆపరేషన్స్ మేనేజర్ గా, డిప్యూటీ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్, ప్లానింగ్ & ఎఫ్. ఓ. ఐ. ఎస్ గా దక్షిణ మధ్య రైల్వే లో వివిధ బాధ్యతలు నిర్వహించారు.
వీరు అధికారుల విభాగంలో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు గాను 2022లో ప్రతిష్టాత్మక జనరల్ మేనేజర్ అవార్డు అందుకున్నారు. పరిపూర్ణత మరియు నిబద్దతతో పనిచేసే వ్యక్తిత్వం గల అధికారి, సానుకూల దృక్పథాన్ని కలిగి వినూత్న పని పద్ధతుల వైపు మొగ్గు చూపే అధికారిగా పేరు గాంచారు.

