వ్యర్ధాల ప్రాసెసింగ్ ను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు చెప్పారు. శుక్రవారం ఆయన ఒంగోలు నగర శివారులోని గుత్తికొండవారిపాలెం గ్రామంలో ఉన్న వ్యర్ధాల డంపింగ్ యార్డును పరిశీలించారు. నగరంలో ప్రతిరోజూ సేకరించిన వ్యర్ధాలను ఇక్కడ ప్రాసెసింగ్ చేస్తున్న తీరును ప్రత్యక్షంగా వీక్షించారు. కొన్ని ఏళ్ల నుంచి వ్యర్ధాలను ఇక్కడ డంపింగ్ చేస్తున్నామని, 2.56 లక్షల టన్నులు పేరుకుపోయాయని అధికారులు ఆయనకు తెలిపారు. వీటిలో ఇప్పటివరకు 1.76 లక్షల టన్నుల వ్యర్థాలను ప్రాసెసింగ్ చేశామని వివరించారు. ఈ ప్రక్రియలో వచ్చే ఆర్.డీ.ఎఫ్.ను సిమెంట్ ఫ్యాక్టరీలకు తరలిస్తున్నామని, ఇనర్ట్ మెటీరియల్ ను లోతట్టు ప్రాంతాలను పూడ్చేందుకు ఉపయోగిస్తున్నామని, బయో సాయిల్ పదార్థాలను ఎరువులుగా వినియోగిస్తున్నామని వారు తెలిపారు. కొత్తగా ఇక్కడ నిర్మించే డ్రై వేస్ట్ సెంటర్ పురోగతి గురించి కూడా వివరించారు. కాగా, వ్యర్ధాల ప్రాసెసింగ్ త్వరగా పూర్తయ్యేలా చూడాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇందుకోసం ప్రజలు ఇంటి వద్దే తడిచెత్తను, పొడిచెత్తను వేరు చేసేలా అవగాహన కల్పించాలని చెప్పారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వలన కలిగే అనర్థాలను కూడా ప్రజలకు వివరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ వెంట ఒంగోలు మునిసిపల్ కమిషనర్ వెంకటకృష్ణయ్య, పబ్లిక్ హెల్త్ ఈ.ఈ. శ్రీనివాస సంజయ్, మున్సిపల్ ఇంజనీర్ యేసయ్య, డీ.ఈ.ఈ. పద్మజ, మెడికల్ ఆఫీసర్ వైష్ణవి, ఇతర అధికారులు ఉన్నారు.

