కొత్తగా అమలులోకి వచ్చిన క్రిమినల్ చట్టాల ప్రకారం, ప్రతి పోలీస్ స్టేషన్లో నిర్వహించవలసిన రికార్డుల నిర్వహణ మరియు నూతన ప్రొఫార్మాలపై అవగాహన కల్పించేందుకు గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని గేలాక్సీ కాంప్లెక్స్ అవగాహన సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ ఎస్సై లు, అన్ని స్టేషన్ ల రైటర్లు, అసిస్టెంట్ రైటర్లు మరియు టెక్నికల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ.. ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించే లక్ష్యంతో రూపొందించిన కొత్త చట్టాలపై ప్రతి పోలీసు అధికారికి పూర్తి అవగాహన ఉండాలని సూచించారు. నూతన చట్టాలకు అనుగుణంగా రూపొందించిన రిజిస్టర్లను తప్పనిసరిగా, నిక్కచ్చిగా నిర్వహించాలని ఆదేశించారు.
నూతన చట్టాల ప్రధాన లక్ష్యం డిజిటలైజేషన్ మరియు వేగవంతమైన న్యాయం సాధన అని అన్నారు. దీనిలో భాగంగా జీరో ఎఫ్ఐఆర్ , ఈ-ఎఫ్ఐఆర్ విధానాలను సమర్థవంతంగా అమలు చేయడంలో రికార్డుల నిర్వహణ కీలకమని పేర్కొన్నారు. అధికార పరిధితో సంబంధం లేకుండా నమోదు చేసే జీరో ఎఫ్ఐఆర్ కాపీతో పాటు, దర్యాప్తు పురోగతి వివరాలు, ఈ-సమన్స్ పంపే ప్రక్రియ, నేర దృశ్యాల వీడియో రికార్డింగ్ , ఈ-సాక్ష్యం వంటి డిజిటల్ విధానాలకు సంబంధించిన రిజిస్టర్లు కూడా కొత్త ప్రొఫార్మా ప్రకారం జాగ్రత్తగా నిర్వహించాలన్నారు.
నేరాల దర్యాప్తు వేగవంతం చేయడంలో భాగంగా, ముఖ్యంగా మహిళలు మరియు పిల్లలపై జరిగే నేరాల దర్యాప్తును రెండు నెలల్లో పూర్తి చేయడానికి సంబంధించిన రికార్డులు పక్కాగా ఉండాలని సూచించారు.
కొత్త చట్టాల అమలుతో పోలీసుల జవాబుదారీతనం మరియు పారదర్శకత మరింతగా పెరుగుతాయని సూచించారు. ప్రాపర్టీ మరియు గవర్నమెంట్ రిజిస్టర్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలన్నారు. కొత్త మార్పుల ప్రకారం, ఛార్జ్షీట్ దాఖలు, ఎఫ్ఎస్ఎల్ నివేదికల నమోదు, అలాగే ప్రిలిమినరీ ఎంక్వైరీ రికార్డుల విషయంలో ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోవాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు.
రికార్డులన్నింటినీ క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ పోర్టల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలన్నారు. నూతన చట్టాలను విజయవంతంగా అమలు చేయడానికి సమర్థవంతమైన రికార్డుల నిర్వహణ చాలా ముఖ్యమన్నారు.
ఈ కార్యక్రమంలో డిసిఆర్బీ ఇన్స్పెక్టర్ దేవప్రభాకర్, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ సూర్యనారాయణ, ఒంగోలు టు టౌన్ సీఐ శ్రీనివాసులు, ఎస్సైలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.



