న్యూఢిల్లీ,మే 20,(జే ఎస్ డి ఎం న్యూస్):
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బుధవారం సమావేశమయ్యారు ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలో కొనసాగుతున్న వివిధ కీలక ప్రాజెక్టులపై ఇరువురు కలిసి సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా నగరాభివృద్ధి, మౌలిక వసతులు, పారిశుద్ధ్యం,ప్రజారవాణాకుసంబంధించిన పలు ముఖ్యమైన అంశాలపై విస్తృతంగా చర్చించారు.
ముఖ్యంగా భాగ్యనగరంలోని మూసీనది పారిశుద్ధ్యానికి సంబంధించిన అంశంపై కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కీలక వివరాలను వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 పథకంలో భాగంగా మూసీనదిలో కలుస్తున్న మురుగు నీటిని శుద్ధి చేసేందుకు మొత్తం 39 సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను (STPs) మంజూరు చేసినట్లు, ఈ ప్రాజెక్టుల మొత్తం వ్యయం రూ.3,975 కోట్లని తెలిపారు.
ఈ 39 STPల ద్వారా రోజుకు 972 మిలియన్ లీటర్ల మురుగు నీటిని శుద్ధి చేసే సామర్థ్యం ఉందన్నారు. దీని వల్ల శుద్ధి చేయని వ్యర్థపు నీరు నేరుగా మూసీనదిలో కలవకుండానిరోధించడంతోపాటు మూసీనది పరిరక్షణ, నగర పారిశుద్ధ్య మెరుగుదలకు ఇది ఎంతో దోహదపడుతుందని ఖట్టర్ వెల్లడించారన్నారు.హైదరాబాద్ మెట్రో రెండోదశ ప్రాజెక్టుకు సంబంధించిన అంశంపైనా సమావేశంలో చర్చ జరిగింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం L&T సంస్థ నుంచి టేకేవర్ చేసుకున్న నేపథ్యంలో మిగిలిన రెండోదశ పనులకు సంబంధించిన డిటేల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR), ఇతర సాంకేతిక వివరాలు అందిన తర్వాత కేంద్ర ప్రభుత్వం సమగ్రంగా పరిశీలించి తదుపరి నిర్ణయం తీసుకుంటుందని ఖట్టర్ తెలిపారు.హైదరాబాద్ మెట్రో రెండోదశ ప్రాజెక్టుకు సూత్రప్రాయంగా కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 ఖర్చుచేసే ప్రాతిపదికన కేంద్రం ముందుకెళ్లేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 162 కిలోమీటర్ల మేర మెట్రో రెండోదశ విస్తరణకు ప్రతిపాదనలుసమర్పించినట్లు పేర్కొన్న ఆయన.దానిపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి తదుపరి చర్యలు చేపడుతుందని వెల్లడించారు.
హైదరాబాద్ నగర అభివృద్ధికి, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకారం అందిస్తోందని మనోహర్ లాల్ ఖట్టర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. వారికి హైదరాబాద్ ప్రజల తరపున తాను ధన్యవాదాలు తెలియ జేసినట్లు కేంద్రమంత్రి గంగా పురం కిషన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలియ జేశారు.


