ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి అందిన వినతులకు నిర్దేశిత గడువులోపల నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ శ్రీ పి రాజాబాబు, అన్ని శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు.
సోమవారం ఒంగోలు కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పిజిఆర్ఎస్) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజాబాబు, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, జిల్లా రెవెన్యు అధికారి శ్రీధర్ రెడ్డి, ఎస్డిసిలు శ్రీమతి కళావతి, విజయజ్యోతి, డిపిఓ వెంకటేశ్వర రావు లతో కలసి పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కు ప్రజల నుండి వచ్చే ప్రతి అర్జీని సంబంధిత శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, సత్వరం పరిష్కరించడంతో పాటు అర్జీదారులు సంతృప్తి చెందేలా అర్జీల పరిష్కారం ఉండాలన్నారు. ఏదైనా కారణంగా ఫిర్యాదు పరిష్కారం సాధ్యం కాకపోతే, దానికి గల కారణాలను అర్జీదారునికి అర్థమయ్యే విధంగా ఎండార్స్మెంటు ఇవ్వాలని సూచించారు. ప్రజా సమస్యలు పరిష్కారంలో ఎటువంటి నిర్లక్ష్యం చూపకూడదన్నారు. సమస్యపై తీసుకున్న చర్యలతో అర్జీదారుడు సంతృప్తి చెందాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిర్యాదులు మళ్లీ రీ-ఓపెన్ కాకూడదని, ఒకవేళ ఏదైనా అర్జీ రీ-ఓపెన్ అయితే సంబంధిత అధికారి తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో పర్యటించి, పరిస్థితిని సమీక్షించాలని కచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు.
ఈ రోజు నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంలో మొత్తం 257 వినతులు రావడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు.

