ఎన్నికల కోడ్ అమలులో ఉందని గ్రామాల్లో సమస్య సృష్టించే కార్యక్రమాలు చేయవద్దని దర్శి డీఎస్పీ అశోక్ వర్ధన్ రెడ్డి అన్నారు. తాళ్లూరు మండలంలోని లక్కవరం గ్రామంలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న డీఎస్పీ అశోక్ వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో ప్రశాంత వాతావరణ కి సహకరించాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికలు నిర్వహించడమే ఎన్నికల కమీషన్ ముఖ్య ఉద్దేశమని అన్నారు. అందుకు ప్రజలు తమ వంతు సహకరించాలని కోరారు. గ్రామంలో ఏ పార్టీ నాయకుడు, కార్యకర్తలు ప్రజలను భయానికి గురిచేసినట్లు తెలిస్తే వెంటనే పోలీసు స్టేషన్ లేదా సంబంధిత అధికారులకు తెలియజేయాలన్నారు. గ్రామాల్లో శాంతి భద్రతల విషయంలో ఎవరైనా భంగం కలిగే విధంగా ప్రవర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. కనుక ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఎన్నికలు జరిగే విధంగా చూడాలని ప్రజలను కోరారు. ఆయన వెంట ఎస్సై వైవి రమణయ్య, సిబ్బంది ఉన్నారు.

